కాంగ్రెస్ ఓటమే మా ధ్యేయం: నరేంద్ర
మెదక్: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా తాము పని చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్యస్) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తన ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలను అవమానించారని, అందువల్ల ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాల్సిన అవసరం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మహిళలను, బలహీనవర్గాలను ముఖ్యమంత్రి అవమానించారని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలను మట్టి కరిపించామని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు అదే గతి పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి నియంతృత్వ పోకడలకు నిరసనగా తమ శాసనసభ్యులు మంత్రి పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన మరోసారి చెప్పారు. బాటలు, యాత్రలు చేపట్టడం మినహా ముఖ్యమంత్రి ఎవరికేం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ అంతిమ ధ్యేయమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఓటమికి పని చేయాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి తగరని ఆయన అన్నారు.