జగన్, భానుమతి, జెసిలపై విచారణ: సిబిఐ
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి, మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి, మద్దెలచెర్వు సూరి భార్య భానుమతిలపై విచారణ సాగుతుందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తెలియజేసింది. పరిటాల రవి హత్య కేసులో మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరితో పాటు 12 మంది నిందితులను జిల్లా అధికారులు మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వారి రిమాండ్ను జిల్లా కోర్టు ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించింది.
పరిటాల రవి హత్య కేసును జిల్లా కోర్టు రెండుగా విడగొట్టింది. రవి హత్య కేసులో ప్రధాని నిందితుడు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీనును కేసు నుంచి విడగొట్టింది. పరిటాల హత్య కేసులో జిల్లా కోర్టు కొత్త క్రైమ్ నెంబర్ ఇచ్చింది. మొద్దు శ్రీనును సిబిఐ అరెస్టు చేయలేకపోవడంతో కోర్టు కేసును రెండుగా విడగొట్టి విచారణ జరపడానికి నిర్ణయించుకుంది. ఇందుకు సిబిఐ అంగీకరించింది. నిందితులందరికీ కోర్టు చార్జిషీట్ ప్రతులను అందజేసింది.