సిపిఐకి తొలి ఏడాది విజయవాడ మేయర్ పదవి
హైదరాబాద్: విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ పదవిని మొదటి విడత భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించింది. ఈ విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎన్నికలకు ముందు కుదిరిన అవగాహన ప్రకారం మేయర్ పదవిని తమకు ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతూ వచ్చింది. మేయర్ పదవిని దక్కించుకోవడానికి తమకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఒక రాజకీయ సందేశాన్ని అందించడానికి సిపిఐకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కేశవరావు చెప్పారు.
మిగతా నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ మేయర్ పదవిలో కొనసాగుతుందని ఆయన చెప్పారు. మేయర్ పదవిపై గురువారం ఉదయం కేశవరావుకు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు మధ్య చర్చలు జరిగాయి. మేయర్ పదవిని ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని విజయవాడ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాజగోపాల్ ప్రకటించారు. నారాయణతో చర్చల తర్వాత కేశవరావు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో మాట్లాడి చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. మొదటి ఏడాది తమకు మేయర్ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం పట్ల నారాయణ హర్షం వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థిని రేపటిలోగా ప్రకటిస్తామని ఆయన చెప్పారు.