ఇచ్చంపల్లికి అంతర్రాష్ట్ర చిక్కులు: ప్రభుత్వం
హైదరాబాద్: అంతర్రాష్ట్ర వివాదాల వల్ల గోదావరినదిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టులను చేపట్టలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరంపై గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టడానికి ఎదరువతున్న చిక్కుల గురించి వివరించింది. మూడు అంగీకరించిన పోలవరం ప్రాజెక్టుకు, కర్ణాటక ప్రభుత్వానికి అడ్వాన్స్ చెల్లించిన జూరాల ప్రాజెక్టుకుకు ఎన్నో ఇబ్బందులు ఎదరవుతున్నాయని, అలాంటప్పుడు ఇతర రాష్ట్రాలతో చిక్కులున్న ఇచ్చంపల్లిని పూర్తి చేయడం సాధ్యం కాదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టకుండా పోలవరం ప్రాజెక్టును చేపట్టడాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం ఇచ్చంపల్లిపై సుదీర్ఘ వివరణ ఇచ్చింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు 1975లో చేసుకున్న ఒప్పందం మేరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సి ఉందని, అది ఈ మూడు రాష్ట్రాల సంయుక్త ప్రాజెక్టు అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇచ్చంపల్లిపై ఒక అంగీకారానికి రావాల్సి ఉందని వివరించింది. అందుకు తాము ఎప్పటికప్పుడు ఆ రెండు రాష్ట్రాలకు లేఖలు రాస్తూనే ఉన్నామని, ఈ మూడు రాష్ట్రాల సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖను కూడా కోరామని ప్రభుత్వం వివరించింది.
ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఇచ్చంపల్లి ప్రాజెక్టును మాత్రం ఎందుకు కట్టమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అడిగారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును చేపట్టడానికి చిక్కులున్నాయనే విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. ఏ ప్రాంతంపైన కూడా తమకు వివక్ష లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ ప్రాజెక్టుల జాబితాను పొన్నాల లక్ష్మయ్య చెప్పారు.