చిలుకూరు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం: జెసి
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ ఆలయం విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే ఉద్దేశం లేదని దేవాదాయ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు డి. శ్రీధర్ బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి దివాకర్ రెడ్డి సమాధానం ఇస్తూ ఆ విషయం స్పష్టం చేశారు. తాము హైకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే చిలుకూరు బాలాజీ ఆలయం విషయంలో వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయమై ఏం చేయాలనేది ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలోని ఆలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో నిత్య ధూపదీప నైవేద్యాల కారక్రమం అమలు జరగడం లేదని శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకులకు వేయి రూపాయల చొప్పున, నిత్య ధూపదీప నైవేద్యాలకు 1500 రూపాయల చొప్పున ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.