పార్లమెంటులోనూ ఎల్లంపల్లి ప్రకంపనలు
న్యూఢిల్లీ: ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రకంపనలు సృష్టించాయి. తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎల్లంపల్లి అక్రమాలపై లోక్సభలోనూ, రాజ్యసభలోనూ మంగళవారంనాడు ప్రస్తావించారు. అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో ఉభయసభల్లోనూ గందరగోళం చోటు చేసుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలని ఎర్రంనాయుడు లోక్సభలో డిమాండ్ చేశారు. తమ డిమాండ్పై ఆయన పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.
ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ప్రస్తావనకు హామీ ఇస్తానని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం జాడలు కనిపించడం లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు విమర్శించారు. ఒక్క రోజులో ఒక ప్రాజెక్టు అంచనాలను 400 కోట్ల రూపాయలు పెంచడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు.