స్పీకర్పై బాబు వ్యక్తిగత వ్యాఖ్యలు: వైయస్
హైదరాబాద్: స్పీకర్ పట్ల ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడి తీరును ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ఖండించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డిపై వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేశారని, ఇది సభా మర్యాద గానీ సంప్రదాయం గానీ కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు. తాము చేపట్టిన కార్యక్రమాలు పూర్తయితే ఉనికి కోల్పోతామనే భయంతోనే తెలుగుదేశం సభ్యులు అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యమంటే మెజారిటీ నిర్ణయమనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ విస్మరిస్తోందని ఆయన అన్నారు. ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీవారు వ్యవహరిస్తున్నారని, అధికారం కోల్పోయామనే విషయాన్ని వారు విస్మరిస్తున్నారని ఆయన అన్నారు.