ఎల్లంపల్లి అక్రమాలు ఉదాహరణ మాత్రమే: బాబు
హైదరాబాద్: పరిశీలన కోసం సాగునీటి ప్రాజెక్టుల ఫైళ్లన్నీ స్పీకర్ ముందుంచాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అక్రమాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక ఉదాహరణ మాత్రమేనని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వం వెనకడుగు వేస్తే తామే ఆ ఫైళ్లను స్పీకర్ ముందు పెడతామని ఆయన చెప్పారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తప్పుడు కాగితాలను ప్రభుత్వం సమర్పించిందని, ఈ విధంగా చేసిన ప్రభుత్వాన్ని తాను ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. తాము తప్పులను ఎత్తిచూపుతుంటే ప్రభుత్వం ఎదురుదాడి లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇది సరైంది కాదని ఆయన అన్నారు.
వారణాసి పేలుళ్ల నేపథ్యంలో ఎల్.కె. అద్వానీ రథయాత్ర తలపెట్టడం బిజెపి ఆంతరంగిక వ్యవహారమని ఆయన అన్నారు. వారణాసి పేలుళ్లను సాకుగా తీసుకుని ఉత్తరప్రదేశ్లోని ములాయం సింగ్ ప్రభుత్వాన్ని విమర్శించడం సరైంది కాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే వారణాసి పేలుళ్లు సంభవించాయని ఆయన అన్నారు. మత వైషమ్యాలు పెంచి పోషించే విధంగా వ్యవహరించడం సరి కాదని, అన్ని మతాలవారు ఇక్కడే జీవించాలని, అందుకు సామరస్యం అవసరమని ఆయన అన్నారు.