ఎల్లంపల్లిపై ప్రభుత్వాన్ని నిలదీసిన బాబు
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం శాసనసభలో ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై సీరియస్గా చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు. ఎల్లంపల్లి అక్రమాలను నిరూపించే ఆధారాలు తమ వద్ద వున్నాయని ఆయన చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను శాసనసభ ముందుంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ వారు ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆయన విమర్శించారు. తమ వద్ద ఉన్నవి చిత్తు కాగితాలని ప్రభుత్వం అంటోందని, తాము తమ వద్ద ఉన్న పత్రాలను అందించామని, ప్రభుత్వం తమ వద్ద ఉన్న పత్రాలతో వాటిని సరి చూసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన నాలుగు ప్రకటనల్లో వైరుధ్యాలున్నాయని, తప్పు చేసి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం రకరకాల ప్రకటనలు చేస్తోందని ఆయన అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, నారా చంద్రబాబునాయుడికి మధ్య వాగ్వివాదం జరిగింది. తమకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటేనే సభను సాగినిస్తామనే పద్ధతిలో తెలుగుదేశం వారు వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు.