ఇద్దరిని చంపిన నక్సల్స్: మరో ఇద్దరి చెర
ఒంగోలు: ఇన్ఫార్మర్లు అనే పేరుతో మావోయిస్టులు ఇద్దరిని చంపేశారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పెదబొమ్మలాపురం గ్రామానికి మావోయిస్టులు సోవామరం అర్థరాత్రి వచ్చి ఐదుగురు గ్రామ యువకులను తమ వెంట తీసుకెళ్లారు. ఈ ఐదుగురిలో ఒక యువకుడు మావోయిస్టుల చెర నుంచి తప్పించుకున్నాడు.
నాగేశ్వరరావు, ఎల్లేష అనే ఇద్దరి శవాల ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువు వద్ద కనిపించాయి. మరో ఇద్దరు ఇంకా మావోయిస్టుల చెరలోనే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల చర్యను ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా విమర్శించారు. ఈ కిరాతక హత్యలపై వివరణ ఇవ్వాలని ఆయన మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీలను డిమాండ్ చేశారు. మావోయిస్టులు విచక్షణారహితంగా హత్యలకు పాల్పడుతున్నారని, ఈ హత్యలకు ఒక పద్దతంటూ లేకుండా పోయిందని ఆయన అన్నారు.