610, పోతిరెడ్డిపాడులపై పిజెఆర్ ఒత్తిడి
హైదరాబాద్: తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవో అమలుపై, పోతిరెడ్డి పాడు ఎత్తు పెంపుపై తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ రెండు అంశాలపై శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
610 జీవోను ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని, పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్పై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఈ రెండు అంశాల విషయంలో కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ రెండు అంశాలపై జనార్దన్ రెడ్డి చాలా కాలంగా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తామని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో జనార్దన్ రెడ్డి డిమాండ్ కాంగ్రెస్ను మరింత ఇరకాటంలో పడేసింది.