స్కామ్ నుంచి కాంగ్రెస్ బయటపడలేదు: బాబు
హైదరాబాద్: ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటపడలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. తమ పత్రాలు నకిలీవని ప్రచారం చేస్తూ కుంభకోణం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలకు సంబంధించి ఆయన బుధవారం మరిన్ని పత్రాలను మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. రూ. 400 కోట్ల కుంభకోణంలో ప్రభుత్వం దోషి అని ఆయన అన్నారు.
తాము వేసిన ప్రశ్నలోని లెక్కలను చూపి తమ వద్ద వున్నవి నకిలీ పత్రాలని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దివాళాకోరుతనమని ఆయన అన్నారు. తమ వద్ద వున్నవి నకిలీ పత్రాలు కావని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వమే పత్రాలను ఫోర్జరీ చేసిందని ఆయన విమర్శించారు. ఫైళ్లను ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్లో పెట్టినప్పుడు స్పీకర్ వద్ద పెట్టడానికి అభ్యంతరాలేమిటని ఆయన ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులటర్ జీవోపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు అందుకు సంబంధించిన ఫైళ్లను భారీ నీటి పారుదల శాఖ మంత్రి పోన్నాల లక్ష్యయ్య గాంధీభవన్లో ఆయనకు చూపించారు.