4 హైదరాబాద్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి
న్యూఢిల్లీ: నాలుగు హైదరాబాద్ పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 148 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులను తలపెట్టారు. మహబూబ్నగర్ జిల్లాలోనికల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీ శాఖ అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటకే పర్యావరణ అనుమతి లభించినట్లు న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 3.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 3 లక్షల మందికి మంచినీరు అందుబాటులోకి వస్తుంది.
రాష్ట్రంలో చేపట్టే రెండు మెగా పవర్ ప్రాజెక్టులకు సహాయం అందిస్తామని కేంద్ర ఇంధన శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే హామీ ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి షబ్బీర్ అలీ చెప్పారు. షబ్బీర్ అలీ సుశీల్కుమార్ షిండేను కలిశారు. ఒక మెగాపవర్ ప్రాజెక్టును హైదరాబాద్, కరీంనగర్ల మధ్య మిడ్ మానేరు వద్ద నెలకొల్పుతున్నట్లు, ఇది గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రమని షబ్బీర్ అలీ చెప్పారు. మరో మెగా పవర్ ప్రాజెక్టును కృష్ణపట్నం వద్ద తలపెట్టనట్లు ఆయన తెలిపారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు బొగ్గు ఆధారిత కేంద్రమని ఆయన చెప్పారు. ఎన్టిపిసి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో వేయి మెగావాట్లు పెంచడానికి కూడా సుశీల్కుమార్ షిండే అంగీకరించినట్లు ఆయన తెలిపారు.