అనంత జైలులో సూరి: ఇతరుల తరలింపు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుల్లో కొందరిని హైదరాబాద్లోని చంచల్గుడా జైలుకు, మరికొందరిని చర్లపల్లి జైలుకు తరలించారు. మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి ఆగడాలపై అనంతపురం జిల్లా జైలు సిబ్బంది భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో వారిని ఇతర జైళ్లకు తరలించారు. సూరిని కూడా తరలించాలని జైలు సిబ్బంది జిల్లా కోర్టును కోరారు. అయితే ఈ విషయం హైకోర్టులో ఉన్నందున జిల్లా కోర్టు ఏ విషయమూ తెలియజేయలేదు.
జూలకంటి శ్రీనివాస రెడ్డి అలియాస్ మొద్దు శీను, రేఖమయ్యలతో పాటు ఆరుగురు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. మరో ఏడుగురు సూరి అనుచరులను చంచల్గుడా జైలు తరలించారు. సూరిని మాత్రం అనతపురం జైలులోనే ఉంచారు. మద్దెలచెర్వు సూరిపై ఆంక్షలు విధించారు. సూరికి ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, క్యాంటిన్ నుంచి భోజనం రద్దు చేయాలని నిర్ణయించారు. జైళ్ల శాఖ డిఐజి జాన్సన్ శామ్యూల్ అనంతపురం జైలును తనిఖీ చేశారు. సూరి ఆగడాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.