రైతుల ఆత్మహత్యలు నిజమే: రఘువీరారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నిజమేనని ప్రభుత్వం అంగీకరించింది. అయితే రైతుల ఆత్మహత్యలు గత తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం వల్లనే జరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. రఘువీరారెడ్డితో పాటు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారంనాడు ఉన్నత స్థాయి సమావేశంలో రైతుల పరిస్థితిపై సమీక్ష జరిపారు. సమీక్షానంతరం రఘువీరారెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలంలో 1261 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అధికారుల కమిటీలు ఈ మరణాలను ధృవీకరించాయని ఆయన చెప్పారు. ఈ ఆత్మహత్యలు కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ విధానాల వల్లనే జరిగాయని ఆన్నారు. రైతుల సహాయార్థం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ను కోరుతామని, ఈ నెల 10వ తేదీన జరిగే సమావేశంలో ఈ విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు.