నన్ను నమ్మండి, న్యాయం చేస్తాం: కొణతాల
విశాఖపట్నం: గంగవరం మత్స్యకారులకు న్యాయం చేస్తామని, తనను నమ్మాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ కోరారు. మీడియాను ఏమార్చి ఆయన బుధవారంనాడు గంగవరం సందర్శించి బాధితులను పరామర్శించారు. పోలీసులు కాల్పుల్లో మరణించిన మత్ప్యకారుడి ఆత్మశాంతికి రేపు ఒక రోజు పోర్టు పనులు ఆపేస్తామని ఆయన వారికి చెప్పారు. గంగవరం బాధితుల పరిష్కారానికి ఈ నెల 8వ తేదీన తిరిగి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతుడు నూకరాజు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి ఆయన 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కొణతాల పర్యటనను అడ్డుకునేందుకు తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు.
మత్స్యకారుల సమస్యల పరిష్కారంలో ఏ విధమైన లోపాలుండవని ఆయన హామీ ఇచ్చారు. మత్స్యకారుల సమస్య పరిష్కారంలో ఏ విధమైన లోపాలు లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. గంగవరం మత్స్యకారులకు మద్దతుగా బుధవారం అఖిల పక్షం, ప్రజా సంఘాలు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశాయి. మంత్రి కొణతాల మంగళవారంనాడు గంగవరం సందర్శించాల్సి వుండింది. అయితే దాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు.