వచ్చే విద్యాసంవత్సరానికి వర్గీకరణ: వైయస్
న్యూఢిల్లీ/అమలాపురం: వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ జరిగేలా ప్రయత్నాలు చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. వీలైనంత త్వరగా ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, లేదంటే చేసేదేమీ లేదని ఆయన అన్నారు. బాబూ జగజీవన్రామ్ జయంతుత్సవాల్లో ఆయన బుధవారం పాల్గొన్నారు.
ఇదిలావుంటే, ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యంఆర్పియస్) నాయకుడు మందకృష్ణ మాదిగ బుధవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర వచ్చే నెల 14వ తేదీ వరకు జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ లోగా వర్గీకరణకు పూనుకోకపోతే 14వ తేదీన జరిగే ముఖ్యమంత్రి వై.యస్. పునరంకిత సభలో నిరసన తెలియజేస్తామని ఆయన చెప్పారు. వర్గీకరణ జరిగితే అదే సభలో వైయస్ను అభినందిస్తామని ఆయన చెప్పారు. వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాలమహానాడు బుధవారంనాడే అమలాపురంలో సదస్సును తలపెట్టింది. దీంతో అక్కడ కాస్తా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.