సియం చెమ్చాగిరి చేస్తున్న మందాడి: తెరాస
హైదరాబాద్: తమ పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి చెమ్చాగిరి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి వి. ప్రకాష్ విమర్శించారు. గృహ నిర్మాణం కుంభకోణం నుంచి బయటపడడానికి ముఖ్యమంత్రికి మందాడి ఆ విధంగా వ్యవహరిస్తున్నారని వారు శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. పార్టీకి, ఉద్యమానికి ద్రోహం చేస్తున్న అసమ్మతి శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. మందాడి సత్యనారాయణ రెడ్డి గత కొద్ది కాలంగా పార్టీకి, ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారన్నారు. స్కామ్ను కప్పిపుచ్చుకోవడానికి పార్టీపై విమర్శలను ముసుగుగా వాడుకుంటున్నారని, అసందర్భమైన వేదికల మీద పార్టీపై మందాడి విమర్శలు చేస్తున్నారని వారన్నారు. గృహ నిర్మాణ పథకం అమలులో మందాడి సత్యనారాయణ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై తాము పార్టీ తరఫున కూడా విచారణ జరిపిస్తున్నామని వారు చెప్పారు.
వరంగల్ జిల్లా కొండపర్తి గ్రామంలో పోలీసులు ఒక వ్యక్తిని కాల్చి చంపడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఖండించారు. రాత్రిపూట కాకుండా పగటి పూట కరెంట్ ఇవ్వాలని తాము కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. పగటి పూట కరెంట్ ఇస్తే ఇటువంటి సంఘటనలు జరగవని వారన్నారు. ఎన్కౌంటర్లు జరిగినప్పుడు పోలీసులపై తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. మెదక్ జిల్లా బొప్పాపూర్ గ్రామంలో రాత్రి బావి వద్దకు వెళ్తున్న యువకులపై పోలీసులు శుక్రవారం రాత్రి కాల్పులు జరపడం వల్ల లవకుమార్ అనే రైతు యువకుడు మరణించాడు. నక్సలైట్లుగా అనుమానించి పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. తాజాగా వరంగల్ జిల్లా కొండపర్తిలో శ్రీరామ నవమి ఉత్సవాలకు వెళ్లి వస్తున్నవారిపై ఆదివారం రాత్రి పోలీసులు కాల్పుల జరపడం వల్ల ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.












Click it and Unblock the Notifications
