తిరుపతిలో కార్పోరేట్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
తిరుపతి: తిరుపతిలోని శ్రీ చైతన్య కళాశాలకు చెందిన విద్యార్థి అధ్యాపకుడు కొట్టినందుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరులోని ఈశ్వర్కాలనీకి చెందిన ఆసిఫ్ అనే విద్యార్థి ఎంసెట్ కోచింగ్ కోసం కళాశాలలో చేరాడు. అతను సెల్ఫోన్లో మాట్లాడినందుకు అధ్యాపకుడు కొట్టాడు. దీంతో ఆ విద్యార్థి కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కళాశాల వద్ద విద్యార్థులు ధర్నాకు దిగారు. కళాశాల ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కిటికీ అద్దాలు పగులగొట్టారు. టెలిఫోన్ లైన్లు తెంపేశారు. ఇంత జరుగుతున్నా కళాశాల ప్రిన్సిపాల్ గానీ, అధ్యాపకవర్గం గానీ ఆయన ఛాయలకు రాలేదు. కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం పూట ఆడుకోనియాలని తాను కళాశాల యాజమాన్యాన్ని కోరానని విద్యార్థి తండ్రి అంటున్నాడు. పది మంది విద్యార్థులను దారుణంగా కొట్టారని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించడమే తమ అధ్యాపకుల పని అని, విద్యార్థిని కొట్టి వుంటే తప్పేనని కళాశాల ప్రిన్సిపాల్ అంటున్నారు.