బాబ్లీ పనులు సమాచార లోపం: విలాసరావు
హైదరాబాద్: సమాచార లోపం వల్లనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పనులు ఆగలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితో చెప్పారు. రైతుల ఆత్మహత్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ సోమవారం ఏర్పాటు చేసిన నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి వచ్చిన విలాస్ రావు దేశ్ముఖ్తో రాజశేఖర్ రెడ్డి బాబ్లీ పనులు ఆగకపోవడంపై మాట్లాడారు.
సమాచార లోపం వల్ల బాబ్లీ పనులు ఆపేయాలనే తమ ఆదేశాలు దిగువ స్థాయి అధికారులకు చేరలేదని విలాస్ రావు దేశ్ముఖ్ చెప్పారు. బాబ్లీ నిర్మాణం పనులను ఆపేస్తామని ఆయన వైయస్కు మరోసారి హామీ ఇచ్చారు. బాబ్లీ ప్రాజెక్టును పరిశీలించడానికి వెళ్లిన నిజామాబాద్ లోక్సభ సభ్యుడు మధుయాష్కీపై అక్కడివారు ఇటీవల దాడి చేశారు. బాబ్లీ పనులను ఆపించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బాబ్లీ సమస్య పరిష్కారానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.