గంగవరం మత్స్యకారులకు కొత్త ప్యాకేజీ
విశాఖపట్నం: గంగవరం మత్స్యకారులకు ప్రభుత్వం కొత్త పునరావాసం ప్యాకేజీని ప్రకటించింది. పాత ప్యాకేజీలో కొన్ని మార్పులు చేస్తూ ఈ కొత్త ప్యాకేజీని విడుదల చేసింది. ఇకపై పోర్టు పనులు సాగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. పునారావాస ప్యాకేజీలో మరికొంత మందిని ప్రభుత్వం చేర్చింది. ఇప్పుడు ఈ ప్యాకేజీని 2078 మందికి వర్తింపజేశారు. ఇంతకు ముందు 1048 మందికి మాత్రమే వర్తింపజేస్తూ ప్యాకేజీని ప్రకటించింది.
అర్హత గల 300 మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. పని కోల్పోతున్న 773 మంది మత్స్యకారుకుల ఒక్కొక్కరికి నెలకు 3 వేల రూపాయల చొప్పున చెల్లిస్తారు. ఏరాడలో ఫిష్ల్యాండ్ను ఏర్పాటు చేస్తారు. ఫిష్ల్యాండ్ వరకు ఒకటిన్నర కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్డును ఏర్పాటు చేస్తారు. గంగవరం, దిబ్బపాలెం గ్రామస్థులకు పోర్టు అనుబంధ పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తారు. ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన ఐక్యవేదిక, అఖిల పక్షం నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications