ముస్లిం రిజర్వేషన్లకు ఇంకా కట్టుబడి ఉన్నాం: వైఎస్
హైదరాబాద్: ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శనివారం ఇక్కడ స్పష్టం చేశారు. వారికి రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు వరకు వెళ్ళామని ఆయన చెప్పారు.
పంచాయితీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం పనితీరుకు రిఫరెండం కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు ఓటమిని అంగీకరించారని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ ఎన్నికలు, ఓట్ల ధ్యాసేనని ఆయన విమర్శించారు. పది ఓట్లు తెచ్చే వారే తనకు ఆప్తులన్న చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన తనకు మాత్రం పేదలందరూ ఆప్తులేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలు తాళిబొట్లు కూడా కొనుక్కోలేని స్ధితిలో ఉన్నారని చంద్రబాబు అనడాన్ని వైఎస్ తిప్పికొట్టారు. బంగారం ధరలకూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదని ఆయన చెప్పారు.