తెలంగాణపై సోనియా మాట్లాడాలి: బిజెపి
కరీంనగర్: తెలంగాణపై మౌనం వీడాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత బండారు దత్తాత్రేయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి రెండేళ్ల పాలనపై విమర్శలు సంధిస్తూ ఆయన సోమవారం ఒక బహిరంగ లేఖ రాశారు. తెలంగాణపై కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టేలా కాంగ్రెస్, తెరాసలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 18వ తేదీన తాము హైదరాబాద్లో ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెరాసను భూస్థాపితం చేసేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుట్ర పన్నారని ఆయన అన్నారు. వైయస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని ఆయన విమర్శించారు. ఉచిత కరెంట్ సరఫరాను సరిగా అమలు చేయడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత రెండేళ్ల కాలంలో నాలుగు వేల మంది రైతులు, చేనేత - గీత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వీరి కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.