పునరంకిత సభతో ఒరిగిందేమిటి?: టిడిపి
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏర్పాటయిన కాంగ్రెస్ పునరంకిత సభ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. పునరంకిత సభలో ప్రజా సమస్యలు లేకపోవడాన్ని, వాటిపై తీర్మానాలు లేకపోవడాన్ని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించారు.
పునరంకిత సభ నిర్వహణను బట్టి ప్రభుత్వ నిర్వాకం, కాంగ్రెస్ నేతల ఉద్దేశ్యాలు బట్టబయలయ్యాయని ఆయన అన్నారు. ప్రాంతీయ పార్టీలపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. పెద్ద యెత్తున అవినీతి జరుగుతోందని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రివి ఎక్కడి లెక్కలని ఆయన అడిగారు.