వర్గీకరణకు ఢిల్లీకి వైయస్ నేతృత్వంలో అఖిల పక్షం
హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల (యస్సి) రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంలో భాగంగా ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష ప్రతినిధుల బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (యంఆర్పియస్) నేత మంద కష్ణమాదిగ తెలిపారు. ముఖ్యమంత్రి తమకు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. మందకష్ణ మాదిగతో పాటు యం ఆర్పియస్ ప్రతినిధులు సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని అఖిల ప్రతినిధుల బృందం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ను, ఇతర జాతీయ పార్టీల నేతలను కలుస్తుందని ఆయన చెప్పారు. వర్గీకరణ బాధ్యతను మున్సిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావుపై పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఒనగూరడం లేదని తాము చెప్పడంతో ముఖ్యమంత్రే స్వయంగా అఖిల పక్ష బృందంతో ఢిల్లీ వెళ్లేందుకు అంగీకరించారని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణ కోసం వైయస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మాలమహానాడు తీవ్రంగా వ్యతిరేకించింది. వర్గీకరణ కోసం ముఖ్యమంత్రి అఖిల పక్ష బృందంతో వెళ్తే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తామని మాలమహానాడు నాయకుడు జె. ప్రభాకరరావు హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రయత్నిస్తే అందుకు తమ తరఫున గెలిచిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర మంత్రులు సూర్యారావు, జె. గీతారెడ్డి, వినోద్ బాధ్యత వహించాల్సి వుంటుందని ఆయన హెచ్చరించారు.