ఎసిబి వలలో ఇఇ: భారీ ఆస్తులు స్వాధీనం
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పని చేస్తున్న పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇఇ) సత్యనారాయణ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ఏక కాలంలో దాడి చేశారు. దాదాపు కోటి రూపాయల విలువ చేసే ఆస్తులను, నగదును ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణపై సత్యనారాయణను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జగిత్యాలలోని సత్యనారాయణ ఇంటిపై, కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి 45 లక్షల విలువ చేసే నగదును, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లోని హిమాయత్నగర్లో గల సత్యనారాయణ ఇంటిపై కూడా వారు దాడులు నిర్వహించారు. 13 లక్షల రూపాయల విలువ చేసే వెండి, 40 తులాల బంగారం, 3 వాహనాలు, 2 ఇళ్లను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని లక్సెట్టిపేటలోని సత్యనారాయణ మామ, చెల్లెలు ఇళ్లపై, ఇతర బంధువుల ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు.