తెలంగాణపై నేడో, రేపో కాంగ్రెస్ వైఖరి: తెరాస
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెస్ తన వైఖరిని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస ప్రకటించింది. తెలంగాణపై ఇక చెప్పాల్సింది కాంగ్రెసేనని తేల్చి చెప్పింది. తెలంగాణపై సందిగ్దతకు తెర దించే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర రావు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. చంద్రశేఖరావుతో పాటు తెరాస మరో నేత ఎ. నరేంద్ర శుక్రవారం సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు చొరవ చూపాలని కూడా చంద్రశేఖరరావు సోనియాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై యుపిఎలో ఏకాభిప్రాయం లేదనే తెలంగాణ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ మాటల్లో నిజం లేదని ఆయన సోనియాతో అన్నారు. తెలంగాణపై బిజెపి నుంచి లేఖను తెప్పించే బాధ్యతను కూడా తీసుకోవాలని ఆయన సోనియాను కోరారు. సమావేశానంతరం చంద్రశేఖర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి నిరాకరించారు.
గత రెండు మూడు రోజులుగా చంద్రశేఖరరావు సోనియాను కలవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాము సోనియా అపాయింట్మెంట్ అడగలేదని, తాము ఇచ్చిన నోట్పై తాను మాట్లాడడానికి పిలుస్తానని సోనియా చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి స్పష్టం చేసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావుతో, ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డితో సోనియా మాట్లాడారు. ఆ తర్వాత చంద్రశేఖరరావుతో శుక్రవారం భేటీ అయ్యారు.