గంగవరంపై సియంతో లెఫ్ట్ నేతల భేటీ
హైదరాబాద్: గంగవరం మత్స్యకారుల సమస్యల విషయంలో ప్రభుత్వం తన పంథా మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వామపక్షాలు హెచ్చరించాయి. వామపక్షాల నేతలు బుధవారం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డిని కలిసి గంగవరం సమస్యను పరిష్కరించాలని కోరారు. గంగవరం మత్స్యకారుల ఆందోళన సందర్భంగా అరెస్టయిన అఖిల పక్ష నేతలను, ఐక్య వేదిక నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. వారిపై పెట్టిన కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని వారు కోరారు.
వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కొణతాల రామకృష్ణ సూచనల మేరకు విశాఖపట్నం అధికారులు మత్స్యకారుల ఆందోళనను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. సంబంధం లేనివారిని కూడా అరెస్టు చేసి జైలులో పెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. తమ చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించినట్లు వారు తెలిపారు.