బాబ్లీపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: పొన్నాల
మహబూబ్నగర్/ హైదరాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఈ విషయమై తాము ఇదివరకే రెండు సార్లు న్యాయనిపుణులతో చర్చించామని, మరోసారి చర్చిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం హైపవర్ కమిటీ ఆదేశాలను కాలరాసిందని ఆయన విమర్శించారు. బాబ్లీ వ్యవహారంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ హైదరాబాద్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టు పనులను ఆపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. బాబ్లీ ప్రాజెక్టుపై తాము ముఖ్యమంత్రిని కలుస్తామని ఆయన చెప్పారు. మహారాష్ట్రలోనూ, ఇక్కడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని, అటువంటప్పుడు ప్రాజెక్టును ఆపించడం కష్టం కాదని ఆయన అన్నారు.