ఐమాక్స్ థియేటర్ నిండా అక్రమాలే: సభా సంఘం
హైదరాబాద్: హైదరాబాద్లోని ఐ మాక్స్ థియేటర్ నిర్మాణం అంతా అక్రమాల మయమని సభా సంఘం అభిప్రాయపడింది. గురునాథ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం తన నివేదికను ఆదివారంనాడు స్పీకర్ కె. సురేష్ రెడ్డి సమర్పించింది. ఐ మాక్స్ థియేటర్ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సభా సంఘం సూచించింది. అన్ని విధాలా పరిశీలించిన తర్వాత ఐ మాక్స్ థియేటర్ను పిల్లల మ్యూజియంగా మార్చాలని సూచించినట్లు గురునాథ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ఐ మాక్స్ థియేటర్ వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. శిఖం భూమిపై ఐ మాక్స్ థియేటర్ను నిర్మించడం, అందుకు ప్రభుత్వం అంగీకరించడం తప్పని ఆయన అన్నారు. అనుమతి రాక ముందే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐ మాక్స్ థియేటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని సంఘం సభ్యుడు పి. జనార్దన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఏడు నెలల తర్వాత దానికి అనుమతి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ నగర పాలక సంస్థ, హుడా వంటి సంస్థల ప్రణాళిక ఆమోదం కూడా దానికి లేదని ఆయన చెప్పారు.