సాహిల్ను ఢిల్లీకి తెచ్చిన పోలీసులు
న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నాయకుడు దివంగత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్, వ్యక్తిగత కార్యదర్శి వివేక్ మొయిత్రాలతో పాటు గురువారంనాడు విందులో పాల్గొన్న నాలుగో వ్యక్తి సాహిల్ జారూను పోలీసులు ఆదివారంనాడు ఢిల్లీకి తీసుకొచ్చారు. రాహుల్, మొయిత్రాలకు ఆ 21 యేళ్ల సాహిల్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు భావిస్తున్నారు. నాటకీయ పరిణామాల మధ్య సాహిల్ శ్రీనగర్లో శనివారం పోలీసులకు లొంగిపోయాడు.
సాహిల్ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణలో మొయిత్రా మృతికి, రాహుల్ అస్వస్థతకు దారి తీసిన మిస్టరీ విడిపోగలదని వారు భావిస్తున్నారు. మీడియాకు కనిపించకుండా సాహిల్ను ఢిల్లీ పోలీసులు ఇందిరా గాంధఋ అంతర్జాతీయ విమానాశ్రయం వెనక గేటు నుంచి తీసుకుని వెళ్లారు. సాహిల్ తండ్రిని పోలీసు అధికారులు శనివారంనాడు ప్రశ్నించారు. సాహిల్ తండ్రి కార్పెట్ వ్యాపారం చేస్తుంటాడు. ముంబాయి, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లో కూడా అతను ఈ వ్యాపారం చేస్తుంటాడు. పోలీసులు శనివారంనాడు కొంత మంది నైజరీయన్లతో పాటు మరి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. త్రిషాయ్ ఖన్నా, కరణ్ అహుజా, రాహుల్ మల్హోత్రాలతో పాటు 16 మందిని పోలీసులు ప్రశ్నించారు.