రాష్ట్రం విడిపోతేనే మేలు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్: రాష్ట్రం రెండుగా విడిపోతేనే మేలని, దానివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. చిత్తశుద్ధి వుంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించాలని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్లను డిమాండ్ చేశారు. మైనారిటీలను బుజ్జగించడానికే రాష్ట్రం ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం డావిన్సీ కోడ్ సినిమా ప్రదర్శనను నిషేధించిందని ఆయన విమర్శించారు. క్రైస్తవ మత రాజ్యాల్లో కూడా డావిన్సీకోడ్ ప్రదర్శనకు అనుమతించారని ఆయన చెప్పారు.
లండన్లో డావిన్సీ కోడ్ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆయన చెప్పారు. ఇండియా కాథలిక్ బిషప్ కూడా డావిన్సీ కోడ్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవచ్చునని అభిప్రాయపడ్డారని, అటువంటప్పుడు రాష్ట్రంలో డావిన్సీ కోడ్ ప్రదర్శనను ఆపేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్లో హిందువుల ఊచకోతకు నిరసనగా ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు సత్యాగ్రహాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. లాభదాయక పదవుల వ్యవహారం తేల్చాలని ఆయన ఎన్నికల కమీషన్కు విజ్ఞప్తి చేశారు.