తీరు మారకుంటే కాంగ్రెస్పైనా పోటీ: సురవరం
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో సర్దుబాట్లపై ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్పై కూడా పోటీ చేస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ జిల్లా నాయకత్వాలు పొత్తులకు సహకరించడం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తమ ఉదార వైఖరిని కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకునే స్థితిలో లేరని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావుల ఉదాసీన వైఖరి వల్లనే జిల్లాల్లో పొత్తులు బెడిసికొడుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ జిల్లా నాయకత్వాలపై ఒత్తిడి తేవడానికి రాజశేఖర రెడ్డి, కేశవరావు మనసు పెట్టడం లేదని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి కొసాగితే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుందని ఆయన అన్నారు.