ఖమ్మం జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల హతం
ఖమ్మం: రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. స్పెషల్ పార్టీ పోలీసులకు, మావోయిస్టులకు ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. ఖమ్మం జిల్లా వాజేడు మండలం పేరూరు అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక ఎ.కె. 47, మరో రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. సంఘటనా స్థలంలో ఎ.కె. 47 దొరకడంతో మృతుల్లో రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరైనా ఉండి వుండవచ్చునని ఆనుమానిస్తున్నారు.
స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ జరుగుతుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారని, పోలీసులను చూసిన మావోయిస్టులు కాల్పులు జరిపారని, ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని అధికార వర్గాలు చెప్పాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఇది మూడో ఎన్కౌంటర్. శనివారం నల్లమల అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. అంతకు ముందు రోజు ప్రకాశం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు రవికుమార్ మరణించారు.