స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రద్దు: హైకోర్టు తీర్పు
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. దీంతో పంచాయతీ ఎన్నికలు రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాగుతున్న సమయంలో హైకోర్టు తీర్పు ఒక కుదుపులాంటిదే. నామినేషన్ల ఉపసంహరణకు రేపు తుది గడువుగా నిర్ణయించారు. ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని వ్యాఖ్యానిస్తూ హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఓటర్ల జాబితాను కూడా హైకోర్టు రద్దు చేసింది. తిరిగి ఓటర్ల జాబితాను తయారు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుల తడకతో కూడిన ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని కూడా హైకోర్టు ఆదేశించింది. కొత్తగా ఓటర్ల జాబితాను తయారు చేసి తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమీషన్ పూర్తి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు నిర్ణయంతో ఎన్నికలు ఇప్పట్లో జరగవని సీనియర్ న్యాయవాది రామచంద్రరావు అన్నారు.
హైకోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ (బిజెపి) స్వాగతించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో బాధ్యత వహించి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితాలో తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ హైకోర్టు తీర్పును స్వాగతించింది. ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యం తలెత్తిన పరిస్థితిపై చర్చించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎ.వి.యస్. రెడ్డి ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
హైకోర్టు తీర్పుపై మళ్లీ అప్పీలు చేయాలని ఎన్నికల కమీషన్ నిర్ణయించుకుంది. తీర్పుపై రేపు హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీలు చేస్తామని ఎన్నికల ప్రధానాధికారి ఎ.వి.యస్. రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఈ విషయమై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమీషన్ తీర్పుపై చర్చించింది. న్యాయనిపుణులను కూడా ఎన్నికల కమీషన్ సంప్రదించింది. ఎన్నికల షెడ్యూల్లో మార్పు లేదని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఎన్నికల కమీషన్ తెలియజేసింది. 234 సెక్షన్ కింద ఎన్నికల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవడానికి వీలు లేదని, ఢిల్లీలోని ఎన్నికల ట్రిబ్యునల్ మాత్రమే జోక్యం చేసుకోవాలని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా ఎక్కడ కూడా నూటికి నూరు శాతం తప్పులు లేకుండా ఉండదని ఎవియస్ రెడ్డి అన్నారు. ఇప్పుడు వెలువడిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తేనే ఎన్నికల ప్రక్రియ కొనసాగించడానికి వీలవుతుందనేది న్యాయనిపుణుల అభిప్రాయం.