సోనియాతో పిసిసి నేత కేశవరావు భేటీ
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు సోమవారంనాడు పార్టీ అధ్యక్షుడు సోనియా గాంధీని కలిశారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని తాను సోనియాకు వివరించినట్లు కేశవరావు సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో కన్నా తాము మెరుగైన ఫలితాలు సాధించామని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ బలం గతంలో కన్నా తగ్గిపోయిందని ఆయన అన్నారు. సిపియంతో కలుపుకుని వచ్చిన లెక్కలను చూపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ బలం పెరిగిందని చెప్పుకుంటున్నారని, సిపియం ఓట్లను తీసేస్తే తెలుగుదేశంవ పార్టీ గతంలో కన్నా బలహీనపడిందని తెలిసిపోతుందని ఆయన అన్నారు. తాము ఆదిలాబాద్, అనంతపురం జిల్లాల్లో కూడా మెరుగైన ఓట్లను సాధించామని ఆయన చెప్పారు. జడ్పిటీసిల్లో 90 శాతం గెలుస్తామని చెప్పి 91 శాతం గెలుచుకున్నామని ఆయన చెప్పారు.