బోనం తప్ప విజయశాంతికేం తెలుసు?: తెరాస
మెదక్: ఏడాదికోసారి బోనం ఎత్తుకోవడం, మళ్లీ చెన్నై వెళ్లిపోవడం తప్ప సినీ నటి విజయశాంతికి ఏం తెలుసునని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీశ్రావు వ్యాఖ్యానించారు. తెరాసతో తెలంగాణ రాదని విజయశాంతి చేసిన ప్రకటనపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై చిత్తశుద్ధి వుంటే తమతో కలిసి రావాలని ఆయన విజయశాంతికి సూచించారు.
విజయశాంతి మాటలు చెప్పడం మాని తమతో పాటు ఉద్యమించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తుందనే నమ్మకం తమకు ఇంకా ఉందని ఆయన చెప్పారు. కేంద్రంలో పదవులపై తమ పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. తాము తెలంగాణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, వ్యూహాత్మకంగా, పద్ధతి ప్రకారం పని చేస్తున్నామని ఆయన అన్నారు. పనిచేస్తున్నవారిపై రాళ్లు వేయడం విజయశాంతి మానుకోవాలని ఆయన అన్నారు.