ఒంగోలుకు నక్సల్స్ మృతదేహాలు: జానారెడ్డి
హైదరాబాద్/ఒంగోలు: నల్లమల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను ఒంగోలుకు తరలించాలని హోం మంత్రి కె. జానారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మొదట మార్కాపురంలో పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే ప్రజా సంఘాల విజ్ఞప్తి మేరకు ఒంగోలుకు తరలించడానికి జానారెడ్డి అంగీకరించారు. అయితే మృతదేహాలను తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్కౌంటర్ జరిగిన రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు మృతదేహాల తరలింపు కార్యక్రమం మందకొడిగా సాగుతోంది.
నల్లమల అడవుల్లో ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నానికి పాలుట్ల వరకు తరలించగలిగారు. ఎన్కౌంటర్ సంఘటనా స్థలం వరకు లారీ వెళ్లడానికి వీలు కాలేదు. లారీ సోమవారం రాత్రి పొద్దపోయిన తర్వాత లారీ అక్కడికి చేరుకుంది. దీంతో మృతదేహాల తరలింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఐదు కిలోమీటర్ల మేరకు గ్రేహౌండ్స్ బలగాలు మృతదేహాలను లారీ వరకు జోలెల్లో తీసుకువచ్చారు. అయితే మంగళవారం సాయంత్రానికి గాని మృతదేహాలు మార్కాపురం చేరుకోలేవని అంటున్నారు.