హైదరాబాద్ సంతోష్నగర్ పియస్లో లాకప్ డెత్
హైదరాబాద్: హైదరాబాద్లోని సంతోష్నగర్ పోలీసు స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. ఒక హత్య కేసులో అరెస్టయిన మహ్మద్ అలీ పోలీసు లాకప్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులే ఈ మరణానికి కారణమని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. లాకప్డెత్కు నిరసనగా ముగ్గురు మజ్లీస్ శాసనసభ్యులు సంతోష్నగర్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
సర్దార్ అలీ అనే వ్యక్తి హత్య కేసులో మహ్మద్ అలీని నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మహ్మద్ అలీని చితకబాది తమకు అప్పగించారని, అస్పత్రికి తీసుకొని వెళ్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడని అతని బంధువులు అంటున్నారు. అయితే తాము అదుపులోకి తీసుకునేటప్పటికే మహ్మద్ అలీ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దీంతో అతడ్ని బంధువులకు అప్పగించి ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సిందిగా చెప్పామని పోలీసులు అంటున్నారు.