నల్లమల ఎన్కౌంటర్పై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: నల్లమల ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఎపిసియల్సి) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నల్లమల ఎన్కౌంటర్లో పాల్గొన్నవారిపై 302 కేసు నమోదు చేసి న్యాయవిచారణ జరిపించాలని ఎపిసియల్సి విజ్ఞప్తి చేసింది. నల్లమల ఎన్కౌంటర్లో మరణించినవారి మృతదేహాలను హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి గానీ, గాంధీ ఆస్పత్రికి గానీ తరలించాల్సిందిగా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ హైకోర్టు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారణ చేపట్టనుంది.
శవాలకు ఫోరెన్సిక్ నిపుణుల చేత పోస్టుమార్టం నిర్వహించాలని కూడా పిటిషనర్లు కోరారు. గుర్తించిన శవాలను మార్చురీలో భద్రపరచేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. నక్సల్స్ కోసం పోలీసుల కూంబింగ్ ఆపేయాలని వారు కోరారు. నల్లమల ఎన్కౌంటర్లో మరణించినవారిలో ఇప్పటి వరకు ఏడుగురిని గుర్తించారు. మాధవ్తో పాటు సుశీల అనే నక్సలైట్ మరణించినట్లు మొదట ప్రకటించిన పోలీసులు ఆ తర్వాత ఎర్రబోయిన కనకయ్య అలియాస్ విశ్వనాథ్, రమణలను గుర్తించారు. తాజాగా మరో ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ఇందులో మావోయిస్టు రాష్ట్ర కమిటీ మాజీ కార్యదర్శి రామకృష్ణ కొరియర్ ఈశ్వర్తో పాటు ఎసియం క్యాడర్ రమ, దళ సభ్యురాలు నాగమణి ఉన్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications
