ప్రాజెక్టుల జాప్యంపై వైయస్ అసంతృప్తి
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ఆయన మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్ణీత వ్యవధికి కొద్దిపాటి ఆలస్యంతో పూర్తి వాటిని పూర్తి చేయగలమని సమావేశానంతరం భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఖరీఫ్ నాటికి ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని, అయితే అనుకున్నదాని కన్నా కొద్దిపాటి ఆలస్యం జరుగుతుందని ఆయన వివరించారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతపై రాజీ పడబోమని ఆయన చెప్పారు. విజిలెన్స్ కమీషన్ నివేదికలను తెప్పించుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాస కార్యక్రమాలపై ఆగస్టులో పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తామని, ఈ రెండు కార్యక్రమాలను వేగవంతం చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ముంపు బాధితుల పునరావాసానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకాల్లో సూక్ష్మ నీటిపారుదల పథకాలు అంతర్భాగమని, దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ప్రాణహితపై మరో రెండు జలవిద్యుత్కేంద్రాలకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు.