ప్రకాశం జిల్లాలో బీభత్సం: బ్యాంక్ మేనేజర్ హత్య
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో రెండు చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. వారి దాడిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఒంగోలులోని రాంనగర్లో గల ఏడో లేన్లో గల బ్యాంక్ మేనేజర్ కోటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు గడ్డపారలతో ఇంటి తలుపులు తెరిచి, కోటేశ్వరరావు దంపతులపై గొడ్డళ్లతో దాడి చేశారు. అనంతరం నగదు దోచుకెళ్లారు. సోమవారం ఉదయం పనిమనిషి చూసే సరికి దంపతులు ఇద్దరూ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడి వున్నారు. వారిని ఆస్పత్రిలో చేర్చగా కోటేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించారు. ఆయన భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కోటేశ్వరరావు ఇంట్లో గతంలో రెండు సార్లు దొంగతనం జరిగింది.
ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా గుర్రప్పతోటలో ఎనిమిది మంది దుండగులు ఒక ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించారు. ఇంట్లోని 200 గ్రాముల బంగారం, 35 వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. వీరు మరో ఇంట్లో దోపిడీకి ప్రయత్నిస్తున్న సమయంలో గ్రామస్థులు చూశారు. దీంతో వారు పారిపోయారు.