ఒక్క ఆర్టీసి కార్మికుణ్ణి కూడా తొలగించం: కన్నా
గుంటూరు: కాంగ్రెస్ అధికారంలో వున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ఆర్టీసి)లో ఒక్క కార్మికుణ్ని కూడా తొలగించబోమని రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. ఎపియస్ ఆర్టీసి ప్రైవేటుపరం చేయబోమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎపియస్ ఆర్టీసిని ప్రభుత్వం ప్రైవేట్పరం చేయబోతోందని, ఉద్యోగులను తొలగిస్తుందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి. వి. రాఘవులు చేసిన ప్రకటనపై ఆయన వివరణ ఇచ్చారు.
తాము ఎనిమిది కొత్త డిపోలు ఏర్పాటు చేస్తున్నామని, 2 వేల బస్సులు కొనుగోలు చేస్తున్నామని, ఈ స్థితిలో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తామని ఆయన అన్నారు. రాఘవులు అనాలోచితమైన ప్రకటన చేశారని ఆయన అన్నారు. అనుభవం కలిగిన రాజకీయ నేత రాఘవులు ఈ విధమైన ప్రకటన చేయడం సరి కాదని ఆయన అన్నారు. తనను గానీ, ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ను గానీ అడిగి రాఘవులు నిజానిజాలు తెలుసుకుంటే బాగుండేదని ఆయన అన్నారు.