ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయం: రోశయ్య
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రి కె. రోశయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు (పియస్యులు) సమర్థంగా పనిచేసేలా బలోపేతం చేస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆర్టీసి, సింగరేణి అద్భుతంగా పని చేస్తున్నాయని, వాటిని మూసేసే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. జీవో నెంబర్ 5 కేవలం బడ్జెట్ అంచనాల కోసం మాత్రమే జారీ చేశామని ఆయన చెప్పారు. తాము ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడి అవసరమైతే జీవో నెంబరు 5ను సవరిస్తామని ఆయన చెప్పారు. జీవో నెంబరు 5 ఆధారంగా ఉద్యోగులను తొలగిస్తారనే అపోహలు వద్దని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 65 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి జీవో జారీ చేసిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు చేసిన విమర్శపై రోశయ్య వివరణ ఇచ్చారు. 65వేల మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్యస్) తొలగించడానికి 1284 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, విఆర్యస్కు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందని ఆయన చెప్పారు. ఉద్యోగులతో చెలగాటమాడటం, పునర్వ్యస్థీకరణ అనేవి ఊహలు మాత్రమేనని ఆయన అన్నారు.