తెరాస కార్యకర్తను కాల్చి చంపిన నక్సల్స్
ఖమ్మం: ఖమ్మం జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో సాయుధ నక్సలైట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్త రవీందర్ రెడ్డిని కాల్చి చంపారు. సిపిఐ (యంయల్) న్యూడెమొక్రసీ నక్సలైట్లు రవీందర్ రెడ్డిని కాల్చి చంపారు. రవీందర్ రెడ్డి హత్యను తెరాస నాయకత్వం ఖండించింది. చేకూరి రవి, రవీందర్ రెడ్డి మరికొంత మంది పంచాయతీ ఎన్నికలపై చర్చించుకుంటుండగా 12 మంది వచ్చి కాల్పులు జరిపారని చెబుతున్నారు. న్యూడెమొక్రసీ అశోక్ దళం ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నక్సల్స్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చేకూరి రవి అనే వ్యక్తిపై కాల్పులు జరుపుతుంటే రవీందర్ రెడ్డి అడ్డు వచ్చాడని, తమ లక్ష్యం రవీందర్ రెడ్డి కాదని న్యూడెమొక్రసీ దళ కమాండర్ మధు ప్రకటించారు. రవీందర్ రెడ్డి న్యాయవాది. తెరాస ప్రాబల్యం పెరగడమే ఈ దాడికి కారణమని అంటున్నారు. ఇటీవలి జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో బయ్యారంలో తెరాస గెలుపొందింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 గ్రామాల్లో తెరాస విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మొదటి నుంచి ఈ ప్రాంతంలో న్యూడెమొక్రసీ ప్రాబల్యం ఉంటూ వచ్చింది. తమ ప్రాబల్యానికి తెరాస అడ్డుగా వస్తుందనే ఉద్దేశ్యంతో నక్సల్స్ ఆ దాడికి దిగినట్లు భావిస్తున్నారు.