అసెంబ్లీ తర్వాతే మంత్రివర్గ విస్తరణ: సియం
విజయనగరం: శాసనసభ సమావేశాల తర్వాత ముహూర్తం చూసి మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. ఆయన ఆదివారంనాడు విజయనగరం జిల్లా వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హుస్సేన్సాగర్లో గణేష్ నిమజ్జనం విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో అన్య మత ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. నిత్యావసర సరుకుల అమ్మకాలపై నియంత్రణ కోసం చట్టం తెస్తామని ఆయన చెప్పారు. మరో వారం రోజుల్లో ఈ చట్టాన్ని తెస్తామని ఆయన చెప్పారు. 2002 సంవత్సరానికి ముందు సరుకుల నిల్వలపై సమాచారం ప్రకటించే చట్టం వుండేదని, ఆ చట్టం రద్దు కావడంతో వ్యాపారాలపై నియంత్రణ లేకుండా పోయిందని, ధరల పెరుగుదలకు ఇది కూడా కారణమని ఆయన అన్నారు.