పోటెత్తిన గోదావరి: ఉత్తర తెలంగాణకు ముప్పు
హైదరాబాద్: మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తర తెలంగాణలో వరద ఉధీతి పెరిగింది. మహారాష్ట్రలోనూ, రాష్ట్రంలోనూ కరుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పోటెత్తుతోంది. ఖమ్మం జిల్లాకు పెద్ద యెత్తున వరద తాకిడి ముప్పు ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో వరద ముప్పు విపరీతంగా వుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లా కోడిపుంజు వలస గ్రామంలో కొండచరియలు విరిగి పడి మరణించినవారి సంఖ్య 12కు చేరుకుంది.
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు వరద ముప్పు ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో కోస్గి వద్ద నిర్మిస్తున్న అలీసాగర్ పంప్హౌస్ నీటిలో మునిగింది. దీంతో అలీసాగర్ నిర్మాణ పనులు ఆగిపోయాయి. కూలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీరాంసగర్కు వరద ఉధృతి పెరిగింది. దీంతో 42 గేట్లు ఎత్తేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని పెద్దవాగు పొంగిపొర్లుతుండడంతో 58 మంది కూలీలు కాగజ్నగర్లోని యస్పియం పంపు హౌస్ వద్ద చిక్కుకుపోయారు. వారిని స్టీమర్ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదిలాబాద్ జిల్లా బాసర రైల్వే వంతెనకు కేవలం 4 అడుగుల లోతులో వరద ప్రవహిస్తోంది. కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం కన్నా 32 శాతం అధికంగా నమోదు కాగా, తెలంగాణలో 2 శాతం అధికంగా నమోదైంది. రాయలసీమలో సాధారణ వర్షపాతం కన్నా 32 శాతం తక్కువగా నమోదైంది.