ఖమ్మం జిల్లాను ముంచెత్తుతున్న వరదలు
హైదరాబాద్: గోదావరి నది ఉప్పొంగి పొర్లుతుండడంతో భద్రాచలం ప్రమాదంలో చిక్కుకుంది. ఖమ్మం జిల్లాలోని బూర్గుంపాడు మండలం వరద తాకిడికి తీవ్రంగా గురైంది. బూర్గంపాడుకు లాంచీలు కూడా చేరుకోలేకపోతుండడంతో బాధితులకు ఆహారం పొట్లాలు అందడం లేదు. కరకట్టకు ముప్పు లేదని, అందవల్ల భద్రాలచం పట్టణానికి ఏ విధమైన ప్రమాదం లేదని అధికారులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో లక్ష మందికిపైగా నిరాశ్రయులైనట్లు ఒక అంచనా. ఎబి పోడేరులో శబరి ఉపనదిలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. ఖమ్మం జిల్లా పారపాక వద్ద రహదారిపై నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కూనవరంలో రెండు రోజులుగా ప్రజలు ఇళ్లపైనే వుంటున్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదివారంనాడు వరద తాకిడి ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. తూర్పు గోదావరి, విజయనగరం, ఖమ్మం జిల్లాల్లో ఆయన పర్యటించారు. విజయనగరం జిల్లాలో 16 మంది మృతి చెందారు. వనకాడు బాధితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వరద తాకిడి ప్రాంతాల బాధితుల తక్షణ సహాయం కోసం 13 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గోదావరి నదికి మరో మూడు రోజుల పాటు వరద ప్రమాదం వుంటుందని ఆయన చెప్పారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలో రహదారులపై నీరు ప్రవహిస్తూనే వుంది. పోలవరం గ్రామంలో రెండు రోజులుగా ప్రజలు ఇళ్ల కప్పులపైనే వుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా చింతలంకలో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాలో లంక గ్రామాలను వరదలు ముంచెత్తాయి. వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన అన్నారు.