వరద బాధితుల సహాయంలో విఫలం: టిడిపి
హైదరాబాద్: వరద బాధితులకు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి విజయరామారావు విమర్శించారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో సహా మంత్రులందరూ వరద తాకిడి ప్రాంతాల్లో మొక్కుబడి పర్యటనలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
భారీ వర్షాలు పడతాయని ముందు హెచ్చరికలు వచ్చినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, అందుకు ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయలేదని ఆయన అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లోనూ కాంగ్రెస్ హింసను కొనసాగించిందని ఆయన విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోనూ హింస యధావిధిగా కొనసాగిందని, ముఖ్యమంత్రి ప్రజాస్వామిక విధానాలకు ఇది అద్దం పడుతుందని ఆయన అన్నారు.