వరద సాయంపై అధికారులను నిలదీసిన వైఎస్
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్లోని పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వెంటనే వరద సహాయ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికార యంత్రాంగంతో వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనేక చోట్ల అధికారులు తమ విధి నిర్వహణలో విఫలమైనట్టు వెలువడిన మీడియా వార్తలపై ఆయన అధికారులను ప్రశ్నించారు. ఎక్కడెక్కడ ఇంకా తగిన చర్యలు తీసుకోలేదో తెలుసుకోలేదో అక్కడక్కడ వెంటనే ప్రజలను ఆదుకోవాలని ఆయన చెప్పారు.
అలాగే, గోదావరి, వంశధార, నాగావళి కరకట్టల పటిష్టతకు అవసరమైన పనులు అక్టోబర్లో ప్రారంభించాలని, ఇప్పటివరకూ తీవ్ర వరదలు సంభవించినప్పుడు తీసుకోవలసిన చర్యలపై దృష్టి పెట్టకపోవడం వల్ల చాలా నష్టం సంభవించిందని, మరోసారి ఇలా జరగరాదని ఆయన ఆదేశించారు. భవిష్యత్తులో ఎప్పుడు ఎంత తీవ్ర రూపంలో ప్రకృతి ఆగ్రహానికి గురి కావలసివచ్చినా మనం ఇప్పటినుంచే అప్రమత్తం కావాలని ఆయన ఆదేశించారు. అలాగే ఈ వరద నష్టం అంచనాలు బుధవారం సాయ్రంత్రానికి పూర్తి కావాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ నెల 18, 19 వ తేదీలలో కేంద్ర పరిశీలన బృందం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు.